దిగువ ఇచ్చినది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అద్యక్షులైన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారితో ముఖాముఖీలో ఒక భాగం; శ్రీ శ్రీ మృణాళినీమాతగారి (అప్పటి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ సంస్థ అధ్యక్షులు) మానిఫెస్టింగ్ డివైన్ కాన్షియస్ నెస్ ఇన్ డైలీ లైఫ్ (Manifesting Divine Consciousness in Daily Life) అనే ఒక కొత్త పుస్తకం ప్రచురించిన కొద్దికాలం తరువాత 2014లో ఇంటిగ్రెల్ యోగా మాగజైన్ లో మొదట ఇది వెలువడింది. ఆధ్యాత్మిక మార్గంలో సఫలతను సాధించడమనే అంశం యొక్క సారాంశాన్ని ఆ పుస్తకం ఏవిధంగా పట్టుకుంది అన్న విషయంపైనే ఈ ముఖాముఖీ ప్రధానంగా దృష్టి సారించింది. 2017లో మృణాళినీమాతగారు పరమపదించిన తరువాత స్వామి చిదానంద గిరి గారు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులయ్యారు.
పూర్తి ఇంటర్వ్యూను యోగదా సత్సంగ మ్యాగజైన్ 2022 సంచికలో చదువవచ్చును. (ఈ మ్యాగజైన్ చందాదారులు ఈ సంచికను, యోగదా సత్సంగ ఆన్లైన్ లైబ్రరీలో చదువవచ్చును. రాబోయే వారాలలో పూర్వ సంచికలలోని వందలాది పేజీలు కూడా వారికి ఈ ఆన్లైన్ లైబ్రరీ ద్వారా అందుబాటులోకి వస్తాయి.)
ఇంటిగ్రెల్ యోగా మ్యాగజైన్ (ఐ.వై.ఎమ్): సఫలతను మీరెలా నిర్వచిస్తారు?
స్వామి చిదానంద గిరి గారు (ఎస్.సి): శ్రీ మృణాళినీమాతగారి కొత్త పుస్తకం, మానిఫెస్టింగ్ డివైన్ కాన్షియస్ నెస్ ఇన్ డైలీ లైఫ్ (Manifesting Divine Consciousness in Daily Life), అన్నది దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం. జీవితంలో సఫలత అంటే నిస్సందేహంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అంటే స్వయంగా మన దివ్య స్వరూపమైన ఆత్మలో స్వభావసిద్ధంగా ఉన్న గుణాలను బాహ్యంగా వ్యక్తపరచడమే.
ఐ.వై.ఎమ్: ఏమిటా గుణాలు?
ఎస్.సి: 24/7 మనం వ్యక్తపరచాలని కోరుతున్న అద్భుతమైన విషయాలు: పరమానందం, ప్రేమ, సమత్వస్థితి, శాంతి, మన ఆత్మలోని ప్రశాంత కే౦ద్రంలో సదా నెలకొని ఉండగలిగే సమర్థత. ఆ ప్రశాంత కే౦ద్రం నుండి మనం మన దైనందిన జీవితంలో వచ్చే సవాళ్ళకు ప్రతిస్పందించ గలుగుతాము. ఏ ఘటనలు సంభవించినా వాటిని దివ్యచైతన్యం, దివ్యానందం, సేవా భావం లేక దివ్యమైన నిస్వార్థ భావాలనే అంతర్వాహినులతో ఎదుర్కొనడాన్ని మనం నేర్చుకోగలము. దీనిని పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “బ్రద్దలవుతున్న లోకాల విధ్వంసం నడుమ చలించకుండా నిలబడగలగడం.”
ఐ.వై.ఎమ్: చలించకుండా మనమెలా నిలబడగలం?
ఎస్.సి: మొదట మనం అడ్డంకులు — మనలోనివి, మన చుట్టూరా ఉన్న ప్రపంచంలోనివి, మన జీవన విధానాన్ని ఒక సవాలుగా తయారు చేసే వీటిని గురించి చాలా వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఇదేమీ సునాయాసంగా జరిగే పని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన పురోగతి యొక్క ఆరంభం ఏదంటే అది ఒక పోరాటమనే వాస్తవాన్ని అంగీకరించడం. జీవితంలో సఫలత అన్నది మనకు ఒక వెండిపళ్ళెంలో అందించాలని ఉద్దేశించబడినది కాదు. ఆధ్యాత్మిక చైతన్యమంటే అప్రయత్నంగా లభించడానికి లేదా తేలికగా తీసుకోడానికి ఉద్దేశించబడినది కాదు.
ఒక అర్థంలో మొత్తం భగవద్గీత అందించే సందేశం అదే; యోగాన్ని గురించిన గ్రంథాలన్నిటిలో గీతను నేను శ్రేష్ఠమైన దానిగా భావిస్తాను. జీవితంలో నిజమైన సాఫల్యాన్ని గురించి తెలిపే అతి శ్రేష్ఠమైన పవిత్ర గ్రంథం అది. గీతా సందేశం యుద్ధం చేస్తున్న రెండు తెగల గాధగా దాచి పెట్టబడింది. పరమహంస యోగానందుల వారు దానిలోని అంతరార్థాన్ని వివరించారు; యోగ దృక్పథం నుంచి గీతను వ్యాఖ్యానిస్తూ, అది స్వయంగా మన లోపలి భిన్న అంశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అని చూపించారు. మనలోని ఒక భాగం సాధారణంగా అహంకారం, స్వార్థపరత్వం, అదుపులో లేని వికారమైన భావోద్వేగాలచే నడుపబడ్తూ ఉంటుంది — ఇది మన మానవ స్వభావంలోని చీకటి పార్శ్వం. ఇంకొక భాగం ఏదంటే మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న మన గుప్తమైన దివ్య సామర్థ్యాలు; ఇవి దివ్య స్వభావ చైతన్యంతో జీవించమని మనకి పిలుపునిస్తున్నాయి. ఇది మనం ప్రతిరోజూ చేయాల్సిన యుద్ధం, ఆ రోజు జరిగిన వాటన్నిటిలో మనం చేసిన పనులు, మన దృక్పధాలు, మన ప్రతిస్పందనలను పునః సమీక్షించుకుంటూ ప్రతి దినాన్ని ఆత్మ పరిశీలనతో, ఆత్మ విశ్లేషణతో మొదలుపెట్టి ముగించాలి.
కాబట్టి ఒక అంశమేమిటంటే జీవితమంటే ఒక పోరాటమని గుర్తించడం. అక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్ళాలి? మన జీవితాలు వేటి చుట్టూ పరిభ్రమించాలని మనం ప్రయత్నిస్తున్నామో ఆ దివ్య గుణాలను మన రోజువారీ కార్యకలాపాలలోనూ, దృష్టి కోణాలలోనూ ఒక భాగంగా చేసుకోడానికి ప్రయత్నించడంతో మనం మొదలుపెడ్తాం. మృణాళినీమాతగారి పుస్తకంలోని విషయం అదే.