పరమహంస యోగానందగారి ఒకానొక యావజ్జీవితాశయం ప్రపంచంలోని అన్ని నిజమైన మతాల వెనుక ఉన్న ఏకైక వాస్తవికతను చాటి చెప్పడం, మరియు దైవ-సాక్షాత్కారం పొందటానికి తూర్పు పశ్చిమ దేశాల సత్యాన్వేషకులకు ఒక సార్వత్రికమైన శాస్త్రమును అందించటం – అనగా ప్రతీ మానవునిలోనూ గుప్తంగా అంతర్లీనమై ఉన్న దివ్యత్వం యొక్క లోతైన అవగాహనను మేల్కొలపటం.
ప్రపంచ మతాల ఐక్యతను చాటి చెప్పడానికి పరమహంసగారు ఉపయోగించిన మార్గాలలో ఒకటి ఏమిటంటే, ఆయన ఉపన్యాసములు మరియు బోధనలు. వీటిలో, తూర్పు పశ్చిమలకు చెందిన దివ్యగ్రంథాలలోని ఎన్నో మరుగున ఉన్న అధ్యాత్మిక సత్యాలను ఆయన వెల్లడించారు మరియు ఈ పవిత్ర గ్రంథాలు సార్వత్రిక మార్గంలో భగవంతునితో ఏకత్వానికి ఎలా దారితీస్తాయో చూపించారు.
ఈ పేజీలలో అత్యంత ప్రశంసలు పొందిన యోగానందగారి కొత్త నిబంధన యొక్క నాలుగు సువార్తలు, భారతదేశపు భగవద్గీత మరియు ద రుబాయత్ ఆఫ్ ఒమర్ ఖయ్యాం (The Rubaiyat of Omar Khayyam) గ్రంథాల వివరణల నుండి సారాంశాన్ని మేము మీతో పంచుకోవాలనుకొంటున్నాం. (ప్రత్యేకంగా “గ్రంథం”గా పరిగణించబడనప్పటికీ, రుబాయత్ అనేది ఇస్లామిక్ సంప్రదాయంలో సూఫీలు బోధించిన గుప్తమైన దివ్య సత్యాలను వివరించే ఆధ్యాత్మిక కవిత్వపు ప్రియమైన రచన.)
ఇక్కడ పరమహంస యోగానందగారి రచనల నుండి మేము మరిన్ని విషయాలను జోడించడం కొనసాగిస్తున్నందున ఈ విభాగానికి తిరిగి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అదనంగా, తూర్పు మరియు పశ్చిమ గ్రంథాల అంతర్లీనంగా ఉన్న ఐక్యతపై యోగానందగారి గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు వ్రాసిన లోతైన గ్రంథాన్ని మేము ప్రత్యేకంగా పేర్కొంటాము.
“విశ్వంలోని మొత్తం జ్ఞానం గీతలో నిక్షిప్తమై ఉంది. అత్యంత గాఢమైనప్పటికీ ద్యోతక భాషలో పరచపడింది… మానవ ప్రయత్నం మరియు ఆధ్యాత్మిక సాధన యొక్క అన్ని స్థాయిలలోనూ అన్వయించబడినది మరియు ప్రయోగించబడింది…. ఒకరు భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళే మార్గంలో ఏ స్థాయిలో ఉన్నా, ప్రయాణంలోని ఆ భాగానికి గీత తన వెలుగును ప్రసరిస్తుంది.”
— శ్రీ పరమహంస యోగానంద
“అన్ని దేశాలు మరియు కాలాల ప్రవక్తలు తమ దైవాన్వేషణలో విజయం సాధించారు. నిజమైన జ్ఞానమయ స్థితి, నిర్భికల్ప సమాధిలోకి ప్రవేశించి, ఈ సాధువులు అన్ని పేర్లు మరియు రూపాల వెనుక ఉన్న పరమ సత్యాన్ని గ్రహించారు. వారి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సలహాలు ప్రపంచానికి పవిత్ర-గ్రంథాలుగా మారాయి. అవి, పదాల యొక్క వివిధ-వర్ణ వస్త్రాల కారణంగా బాహ్యంగా విభిన్నంగా ఉన్నప్పటికీ, అన్ని వ్యక్తీకరణలు – కొన్ని బహిరంగంగా మరియు స్పష్టంగా, మరికొన్ని రహస్యంగా లేదా ప్రతీకాత్మకంగా ఉన్నప్పటికీ, ఒకే పరమాత్మ యొక్క ప్రాథమిక సత్యాలు.
“నా గురుదేవులు, శ్రీరాంపూర్లోని జ్ఞానావతారులు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు (1855-1936), క్రైస్తవ మత మరియు సనాతన ధర్మ గ్రంథాల మధ్య అంతర్లీనమైన ఐక్యతను గుర్తించడానికి గొప్ప సమర్థులు. పవిత్ర గ్రంథాలను తన మనస్సు అనే నిష్కల్మషమైన తలంపై ఉంచడం ద్వారా, ఆయన వాటిని సహజమైన సహజావబోధ-జ్ఞానం అనే చాకుతో ఛేదించగలిగేవారు, ప్రవక్తలు మొదట ఇచ్చిన సత్యాల నుండి పండితులు మధ్యలో చేర్చినవి, మరియు తప్పుగా వివరించినవి వేరు చేయగలిగేవారు.”
— శ్రీ పరమహంస యోగానంద
“నేను రుబాయత్ యొక్క ఆధ్యాత్మిక వివరణపై పని చేస్తున్నప్పుడు, అది నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేటంత అంతులేని చక్రవ్యూహము వంటి సత్యంలోకి నన్ను తీసుకువెళ్ళింది. ఈ శ్లోకాలలో ఖయ్యామ్ యొక్క అధ్యాత్మిక మరియు ప్రయోగాత్మక తత్వాన్ని కప్పి ఉంచడం నాకు ‘ది రివిలేషన్ ఆఫ్ సెయింట్ జాన్ ది డివైన్’ని గుర్తు చేస్తుంది.”
— శ్రీ పరమహంస యోగానంద